డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి పరుగులు

• అన్ని వర్గాలకు అధికారం అందాలి
• సామాజిక న్యాయంతోనే సమగ్ర అభివృద్ధి
• తెలంగాణ స్ఫూర్తితోనే ఆంధ్ర ప్రదేశ్ లో రౌడీలతో పోరాటం
• 2004 తర్వాత జరిగిన దోపిడీ మళ్లీ తెలంగాణలో జరగకూడదు
• బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని బీజేపీ ప్రకటించడం గొప్ప విషయం
• జనసేన రాజకీయ ప్రస్థానంలో తెలంగాణకు ప్రాధాన్యం
• తాండూరు ప్రచార సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్దించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంద”ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గ ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా శ్రీ నేమూరి శంకర్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. ఇక్కడ ప్రతి అణువులోనూ ఆశయం దాగి ఉంటుంది. దేనికీ భయపడకుండా, కష్టానికి వెరవకుండా ముందుకు సాగే యువత తెలంగాణలోనే ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం స్ఫూర్తితోనే నేను ఆంధ్రప్రదేశ్ లోనూ రౌడీ మూకలతో పోరాడగలుగుతున్నాను. ఈ నేల, గాలి ఇచ్చిన ధైర్యంతోనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతున్నాను. బండెనక బండి కట్టి అంటూ ప్రజా యుద్ధ నౌక శ్రీ గద్దర్ అన్న పాడిన పాటలే నా రాజకీయ అడుగులకు స్ఫూర్తి. తెలంగాణ అభివృద్ధి దశలో ముందుకు వెళ్లడానికి జనసేన పార్టీ పనిచేస్తుంది. నాకు పదవుల మీద ఆశ, అధికారం మీద ప్రేమ అనేవి లేవు. నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాను. బీజేపీ ప్రస్థానంలో 31 మంది బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రులుగా చేశారు. బీసీ వర్గానికి చెందిన శ్రీ నరేంద్ర మోదీ గారి పాలనలో దేశం ముందుకు దూసుకువెళ్తోంది. తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని 16 ఏళ్ల శివ అనే యువకుడు నా దగ్గరకు వచ్చి పోరాడాలని కోరడం ఇప్పటికీ నాకు స్ఫూర్తి నింపుతుంది. ఇక్కడి యువతలో పోరాడే తత్వం, తప్పు జరిగితే ప్రశ్నించే తత్వం నన్ను కదిలిస్తుంది.
• శ్రీ మోదీ నాయకత్వంలో దేశం పరుగులు తీస్తోంది
ప్రపంచంలోనే 5వ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగల దేశంగా భారతదేశం ఎదిగింది. బీసీలకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్లను విడుదల చేసి, వారి అభ్యున్నతికి ఖర్చు చేయడం సామాన్య విషయం కాదు. అలాగే రూ.43 వేల కోట్లను కేంద్రం తెలంగాణ కోసం ఇచ్చింది. అన్ని విధాలుగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది. ఉగ్రవాదాన్ని దేశం నుంచి రూపుమాపడంలోనే కాదు.. మా దేశంలోకి వచ్చి మీరు దాడులు చేస్తే, మీ ఇళ్లలోకి వచ్చి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు పంపేలా బీజేపీ పని చేస్తోంది. దీనివల్ల దేశంలో ఉగ్రవాదం తగ్గి, పారిశ్రామికీకరణ పెరిగింది. యువతకు అవకాశాలు వస్తున్నాయి. ఇదే తీరున దేశం ముందుకు సాగితే మరికొద్దిరోజుల్లోనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. తెలంగాణలోనూ బీజేపీ నాయకత్వంలో ఇలాంటి సుస్థిరమైన అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్నాను. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఒకే రకమైన ప్రభుత్వాలు ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు అయితే ఎంతో వేగంగా తెలంగాణ అభివృద్ది దిశగా సాగుతుంది.
• శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో దోపిడీ
2004 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయలో జలయజ్ఞం పేరు చెప్పి విపరీతమైన దోపిడీ జరిగింది. అలాంటి పరిస్థితి మళ్లీ తెలంగాణలో రాకూడదు. అవినీతికి దూరంగా, అభివృద్ధికి దగ్గరగా ఉండే పాలన కావాలి. తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణలోని అన్నీ వర్గాలకు బంగారు భవిత ఉంటుంది. ఇక్కడి ప్రజానీకానికి నేను చివరి వరకు అండగా నిలుస్తాను. మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను దాన్ని తీర్చేందుకు ముందు ఉంటాను. సుమారు 3 దశాబ్దాల తర్వాత అయినా వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని బలంగా కోరుకుంటున్నాను. బీజేపీ అధి నాయకత్వం మాట ఇస్తే కచ్చితంగా అది తీరుతుంది. తన జాతి కోసం పోరాడిన శ్రీ మంద కృష్ణ మాదిగ వంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకుంటానని మాట ఇచ్చిన శ్రీ మోదీ గారి నాయకత్వంలో అందరికి న్యాయం జరుగుతుంది. దేశం ఎంత భద్రంగా ఉందో, తెలంగాణ సైతం అంతే భద్రంగా ఉండాలంటే బీజేపీ – జనసేన కలయికలోని ప్రభుత్వం ఏర్పడాలి. నా వెంట 2004 నుంచి ప్రయాణం చేస్తున్న శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ను తాండూరు ప్రజానీకం అక్కున చేర్చుకొని, గుండెల్లో పెట్టుకోవాలని కోరుతున్నాను. జనసేన ప్రస్థానంలో తెలంగాణకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని మాట ఇస్తున్నాను.’’ అన్నారు. ఈ సభలో తాండూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ శంకర్ గౌడ్, నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణ్ శివ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మండలి రాజేష్, బీజేపీ నాయకులు శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.