ఎన్నికల నగారాకు ముందే తాయిలాల ప్రకటన

ఎన్నికలు ఏవైనా… వాటి ప్రకటన వచ్చాకే తాయిలాలు ప్రకటించడం పరిపాటి. కానీ బెంగాల్‌, తమిళనాడులో ఎన్నికల నగారా మొదలు కాకముందే ప్రజలను బుట్టలో వేసేందుకు ఎర వేయడం మొదలు పెట్టారు. బెంగాల్‌లో రాష్ట్ర అర్బన్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీం కింద కార్మికులకు ఇచ్చే వేతనాన్ని పెంచుతామని అన్నారు. నైపుణ్యం లేని కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న రూ.144 నుండి రూ.202 కు, సెమీ స్కిల్డ్‌ కార్మికులకు 172 రూపాయల నుండి రూ. 303కు పెంచారు. అదేవిధంగా జాబ్‌ స్కీం కింద కొత్త కేటగిరిని చేర్చి… నిపుణులకు రోజువారీ వేతనం రూ.404 ఇస్తామని చెప్పారు. ఈ పథకాల ద్వారా 40,500 మంది అన్‌స్కిల్డ్‌, 8 వేల మంది సెమీ స్కిల్డ్‌, మరో 8 వేల మంది నిపుణులు లబ్ధి పొందుతారని చెప్పారు. మరో వైపు తమిళనాడులో కులాలకు పెద్ద పీట వేస్తూ ఓ బిల్లు ఆమోదం పొందింది. డీ నోటిఫైడ్‌ కమ్యూనిటీ, మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌లకు 20 శాతం రిజర్వేషన్ల పరిధిలో వన్నియార్‌ నియోజకవర్గానికి 10.5 శాతం కోటాను అందించే బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనీస్వామి ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందింది. అయితే ఈ సెషన్‌కు ప్రతిపక్ష డిఎంకె, దాని మిత్రపక్షాలు హాజరుకాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *