పెంచనర్లను అడ్డుపెట్టుకొని వైసీపీ కొత్త డ్రామాలు

తాడేపల్లిగూడెం, జగన్మోహన్ రెడ్డి పింఛన్ల రూపంలో కొత్త డ్రామాకు తెర తీసాడని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పల్లెపోరులో భాగంగా పెంటపాడులో నాలుగవ రోజు శ్రీనివాస్ జనసేన-టిడిపి-బిజెపి నాయకులతో కలిసి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, వాలంటీర్లను పింఛన్ల పంపిణీకు దూరంగా ఉంచాలని నిబంధన విధిస్తే దాన్ని రాజకీయం చేశారని, మూడు రోజులైనా పింఛన్ల డబ్బులు పంపించకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అబ్బా తాతలతో పాటు అభాగ్యులైన దివ్యాంగులను కూడా రోడ్లపైకి రప్పించి తన రాక్షసి క్రీడ మొదలుపెట్టాడని ఆరోపించారు. జనసేన-టిడిపి-బిజెపి నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో స్థానిక ఎమ్మెల్యేకి ఓట్లు వేస్తే కనీసం పెంటపాడులో డ్రైనేజీ కూడా నిర్మించలేని పరిస్థితిలో ఈ పాలన దిగజారి పోయిందన్నారు. ఎంతో అభిమానంతో ఓట్లు వేసిన ప్రజలని నీచ స్థితికి స్థానిక ఎమ్మెల్యే దిగజారడం దారుణం అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.