పవన్ కళ్యాణ్ కి ప్రేమతో ఓటు వేశారు

• పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
• టీడీపీ, బీజేపీ శ్రేణులు మమేకమైన తీరు మరువలేనిది
• శ్రీ పవన్ కళ్యాణ్ బాధ్యతను మరింతగా పెంచారు

అభిమానంతో ఓటు వేయడం వేరు… ఇష్టంతో ఓటు వేయడం వేరు… పిఠాపురం నియోజక వర్గం ఓటర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రేమతో ఓటు వేశారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచి నేటి వరకు అలుపెరగని పోరాట పటిమతో పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పని చేసిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల శ్రమ వెలకట్టలేనిది. మరీ ముఖ్యంగా టీడీపీ, బీజేపీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులతో మమేకమైన తీరు మరువలేనిది. పిఠాపురం ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాధ్యతను మరింతగా పెంచారు. సాధారణంగా ఒక నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపు కోసం పని చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. అలాంటిది సాక్షాత్తు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడంతో పిఠాపురం పార్టీ శ్రేణుల్లో ఒత్తిడి ఏర్పడిన సంగతి వాస్తవం. అయినప్పటికీ ఏ చిన్న ఇబ్బందీ లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి దోహదపడిన ప్రతీ ఒక్కరి సేవలు ప్రశంసించదగినవి. మండల, గ్రామ, పట్టణ, వార్డు స్థాయిలో కమిటీలుగా ఏర్పడి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు శ్రమించిన ప్రతీ ఒక్కరి సేవలను గుర్తిస్తాం అని శ్రీ నాగబాబు స్పష్టం చేశారు.