వీల్‌ చైర్‌లో మమతా ఎన్నికల ప్రచారం

కోల్‌కతా : ఇటీవల కాలికి గాయమై.. ఆసుపత్రిలో చికిత్స పొంది..డిశ్చార్జి అయిన బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం గాంధీ మూర్తి నుండి హజ్రా వరకు ప్రచార ర్యాలీలో పాల్గొననున్నారు. వీల్‌ చైర్‌లో ఆమె ఈ ప్రచారాలను మొదలు పెట్టనున్నారు. హజ్రాలో బహిరంగ సమావేశంలో మమతా ప్రసంగించనున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మమతా పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో ప్రచారం చేసేందుకు వెళ్లిన ఆమెను దుండగులు కారులోకి తోసేయడంతో పాదం, కుడి భుజం, మోచేయి, మెడకు తీవ్ర గాయాలైన సంగతి విదితమే. అనంతరం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.