తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది విద్యా సంవత్సరమంతా గందరగోళంగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఈ విద్యాసంవత్సరాన్ని వృథా కానివ్వొద్దన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పాఠశాలలను కొద్ది రోజుల క్రితం ప్రారంభించాయి. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పలు బోర్డు పరీక్షల సిలబస్ ను ఇప్పటికే తగ్గించాయి. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ ను సైతం అందించేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 2.20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఈ స్టడీ మెటీరియల్ ను అందించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందించింది.