పవన్ కల్యాణ్ ను కలిసిన తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ

తిరుపతి పార్లమెంటు స్థానం బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ నిన్నసాయంత్రం హైదరాబాదులో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ, జనసేన ముఖ్యనేతల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన ప్రచార వ్యూహం, ఇతర అంశాలను చర్చించారు.

కాగా ఈ సమావేశంలో పవన్ కల్యాణ్, రత్నప్రభ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.