సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలి: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ తెలంగాణలోని సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు కేటీఆర్ లేఖ రాశారు. ఎలాంటి జాప్యం లేకుండా సీపీడీఎస్ కింద సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని లేఖలో కోరారు. ఈ విషయమై కేంద్రానికి ఇప్పటికే ఏడు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు పుష్కలంగా ఉన్నాయి. చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, రాయితీలతో పాటు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. కేంద్రం ప్రకటించిన పథకాల వల్ల వనరులు లేని రాష్ట్రాలకు సబ్సిడీలు మళ్లిస్తున్నాయన్నారు.