హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని పాతబస్తీలో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బహదూర్‌పురాలోని ఓ గోదాములో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో  మూడు గోదాములకు వ్యాపించాయి. స్థానికులు మంటలను గమనించే సరికే గోదాములు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం కారణంగా సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన గోదాములు రోడ్డు పక్కనే ఉండడంతో కాసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కొన్ని గంటలపాటు కష్టపడ్డారు. ఈ క్రమంలో గోదాము గోడలను కూల్చాల్సి వచ్చింది.  పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన గోదాముల్లో వాహన విడిభాగాలు, బొగ్గు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దాదాపు రూ. 50 లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.