హైదరాబాద్‌ నుంచే కరోనా వ్యాక్సిన్‌ అతి త్వరలోనే: తమిళిసై

స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అనతరం రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో రాజ్‌భవన్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించి, శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి తొలి కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలో రానుందని ఆమె అన్నారు. దేశానికి 40 శాతం ఔషధాలను భాగ్యనగరమే సమకూరుస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తుందన్నారు. దేశంలో యువత సంఖ్యే అధికమని, ఇదే ప్రపంచదేశాలను నడిపించగల సత్తాను సమకూర్చిందని చెప్పారు. అనేక మంది బలిదానాలు, త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చిందని.. వారిని గౌరవించాలని, దేశసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సందర్భంగా గవర్నర్‌తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.