కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో  రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి రానుంది.

నేటి నుంచి ఈ నెల 30 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో గడిచిన ఒక్క రోజులో దాదాపు 6 వేల వరకు కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. నిన్న 1,22,143 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 5,926 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజే 2,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరుకుంది. 3,16,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి.