కేరళలో 48 గంటలపాటు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు

రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. మహమ్మారిని నిలువరించేందుకు 48 గంటలపాటు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించింది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసర పనులపై బయటకు వచ్చే వారిని, సరైనపత్రాలు చూపించిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

కేరళలో మొన్న రికార్డు స్థాయిలో ఏకంగా 28 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు, ఆర్టీసీ బస్సులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కూరగాయాల మార్కెట్లలో రద్దీ తగ్గింది. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో ఉన్న సరిహద్దును ఒడిశా మూసివేసింది.