భారత్కు పాక్ ప్రశంస
విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయాలకంటే, భారత రాయబార కార్యాలయాలే బాగా పనిచేస్తాయని పాక్ ప్రాధాని ఇమ్రాన్ ఖాన్ కితాబిచ్చారు. పాకిస్తాన్ రాయబారులు తమ ధోరణి మార్చుకొని, విదేశాల్లో ఉన్న పాకిస్తానీలకు అండగా ఉండాలని ఇమ్రాన్ హితవుపలికారు. విదేశాల్లో ఉన్న తమ ప్రవాసులకు సాయం చేయడంలో కానీ, స్వదేశానికి పెట్టుబడులు సాధించడంలో కాని భారత్ రాయబారులను చూసి నేర్చుకోవాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ రాయబారులకు ఇమ్రాన్ హితబోధ చేశారు. సౌదీ రాజధానిలో తమ పట్ల పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు కఠినంగా వ్యవహరించారంటూ రియాద్లో పనిచేసే కార్మికులు ఫిర్యాదు చేయడంతో ఇమ్రాన్ సర్కార్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆ కార్యాలయంలో పనిచేసే రాయబారితో పాటు మరో ఆరుగరు అధికారులను వెనక్కి పిలిపించింది. విదేశాల్లోని పాకిస్తానీలకు ఆ దేశ రాయబార కార్యాలయాలు అండగా ఉంటున్నాయా? లేదా? అనే విషయంలో నివేదిక సమర్పించాలని విదేశ వ్యవహారాల శాఖను ఇమ్రాన్ ఆదేశించారు. ఆయా దేశాల్లో పనిచేస్తున్న పాకిస్తానీ కార్మికుల పట్ల తమ రాయబార కార్యాలయాల వ్యావహార శైలి మారాల్సి ఉందని హితబోధ చేశారు.