ఏపీకి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన డబ్ల్యూహెచ్ఓ

ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏపీకి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించింది. డబ్ల్యూహెచ్ఓ అందించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏపీలోని కొవిడ్ కేర్ సెంటర్లలో అత్యవసర చికిత్సలో భాగంగా ఉపయోగించనున్నారు.

కాగా, నిన్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ సీఎం జగన్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అంశాన్ని ప్రస్తావించారు. 18,500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇవే కాకుండా జిల్లా స్థాయిలో 53 ఆక్సిజన్ ప్లాంట్లు, 50 క్రయోజెనిక్ ట్యాంకులు, 10 వేల డీ టైప్ సిలిండర్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందుకోసం రూ.309 కోట్ల మేర వెచ్చిస్తున్నామని సీఎం జగన్ సభకు వివరించారు.