తెలంగాణలో పాఠశాలల వేసవి సెలవులు జూన్ 15 వరకు పొడిగింపు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు, పాఠశాలలతో పాటు డైట్ కాలేజీలకు ఈ వేసవి సెలవుల పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని, అందుకే సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.