10 లక్షల డోసులివ్వండి: కేంద్రానికి కోల్ ఇండియా లేఖ

దేశంలోనే అతిపెద్ద సంస్థలలో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్.. తమకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్లను ఇవ్వాలని లేఖ రాసింది. ఇప్పటికే 400 మంది కరోనా బారిన పడి చనిపోయారని పేర్కొంది. 2.59 లక్షల మంది ఉద్యోగులున్న సంస్థ.. తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేసేందుకు పది లక్షల డోసులను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

ఇప్పటిదాకా కేవలం పావు వంతు ఉద్యోగులకే టీకాలు అందాయని పేర్కొంది. సంఖ్యా పరంగా 64 వేల మంది టీకాలు వేసుకున్నారని చెప్పింది. ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, మరింత నష్టం జరగకుండా ఉండేందుకు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించాలనుకుంటోందని అఖిల భారతీయ ఖదన్ మజ్దూర్ సంఘ్ సుధీర్ ఘుర్దే అన్నారు.

కాగా, కరోనా లాక్ డౌన్ సమయంలోనూ బొగ్గు గని ఉద్యోగులు, కార్మికులు రేయింబవళ్లు పనిచేశారు. విద్యుదుత్పత్తిలో కీలకమైన ఇంధనం బొగ్గును నిరంతరం వెలికి తీశారు. సెకండ్ వేవ్ లో మహమ్మారి కారణంగా మరణాలు పెరిగినా లెక్క చేయకుండా విధులు నిర్వర్తించారు.