అసోంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. అయినా ఆంక్షలు పొడిగింపు

అసోం ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో కరోనా ఆంక్షలను సడలించింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న కోవిడ్-19 నిషేధాజ్ఞలను జూన్ 22 వరకు పొడిగించింది. ఈ మేరకు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు జూన్ 16 ఉదయం 5 గంటల నుండి జూన్ 22 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయి. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితులను సమీక్షించామని, కొన్ని జిల్లాల్లో కోవిడ్-19 బాధితుల సంఖ్య, కరోనా వ్యాప్తి రేటు తగ్గుతోందని, అయినా పరిస్థితులు ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉన్నాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19ను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉత్తర్వులలో తెలిపారు.