ఏపీలో ఎంసెట్ కు బదులు కొత్త సెట్

ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ ప్రవేశ పరీక్షగా ‘ఈఏపీ సెట్’ను నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఎంసెట్ కు బదులుగా కొత్త టెస్ట్ ను తీసుకొస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 24న విడుదల చేస్తామని, 26 నుంచి జులై 25 వరకు దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

జులై 25 తర్వాత జరిమానాలతో దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. 26 నుంచి ఆగస్టు 5 వరకు రూ.500, ఆగస్టు 6 నుంచి 10 వరకు రూ.వెయ్యి, ఆగస్టు11 నుంచి 15 వరకు రూ.5 వేలు, 16 నుంచి 18 వరకు రూ.10 వేల లేట్ ఫీజుతో దరఖాస్తులను తీసుకోనున్నారు. సెప్టెంబర్ మొదటి, రెండు వారాల్లో ఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్సెట్, పీసెట్, పీజీసెట్ నిర్వహించనున్నారు.