డిమాండ్ల పరిష్కారానికి దివీస్ సంస్థ అంగీకరించలేదు.. ప్రభుత్వమే మోసం చేస్తోంది
కోనసీమ ప్రజల డిమాండ్ల పరిష్కారానికి దివీస్ సంస్థ అంగీకరించిందంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. స్థానికులపై పెట్టిన క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులు తొలగిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేయలేదని, సంస్థను వేరొక ప్రాంతానికి తరలించడానికి కూడా అంగీకరించలేదన్నారు. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో రొయ్యల వ్యాపారం దెబ్బతిని యువత ఉపాధి కోల్పోతారని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి తప్ప దివీస్ సంస్థ కాదన్నారు.
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కొత్తపాకల వద్ద దివీస్ ఫార్మా పరిశ్రమ ప్రతిపాదిత ప్రాంతం వద్ద కొంతకాలంగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ కొందరిపై ఫిర్యాదు చేసింది. కాలుష్య కారక పరిశ్రమ ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దివీస్ యాజమాన్యానికి ప్రభుత్వం తరఫున మంత్రి గౌతంరెడ్డి శనివారం కొన్ని ప్రతిపాదనలు చేశారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన వారిపై తక్షణమే కేసులు ఉపసంహరించుకోవడంతో పాటు కాలుష్యంపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి దివీస్ యాజమాన్యానికి సూచించారు.