తెలంగాణ ప్ర‌భుత్వానికి 20 అంబులెన్స్‌లు అందించిన జీ సంస్థ

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో క‌రోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి  సాయం చేసేందుకు జీ సంస్థ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి 20 అంబులెన్స్‌లు, 4 వేల పీపీఈ కిట్ల‌ను విరాళంగా అందించి జీ సంస్థ ఉదారతను చాటుకుంది. తెలంగాణకు అందించిన అంబులెన్స్‌ల‌ను మునిసిపల్. ఐటీశాఖ మంత్రి కే. తారక రామారావు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సోమ‌వారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు సంస్థకు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ జీ సంస్థ‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి జీ సంస్థ 20 అంబులెన్స్‌లు విరాళంగా అందించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ప్ర‌భుత్వానికి ఈ సాయం ఎంతో ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంద‌ని ఈ మేరకు జీ సంస్థను అభినందిస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఆయన జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో పునిత్ గోయంక జీ కార్పోరెట్ జీ టీవీ తెలుగు  కు ధన్యవాదాలు తెలిపారు.