JEE, NEET పరీక్షలు సెప్టెంబరు నెలలోనే: సుప్రీం కోర్టు

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా అతిముఖ్యమైన ప్రవేశ పరీక్షలు ఐఐటీ, జేఈఈ, నీట్ వాయిదా వేయాలన్న పిటిషన్‌ను సర్వోన్నత ధర్మాసనం తోసిపుచ్చింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు విలువైన సంవత్సరాన్ని నష్టపోతారని.. ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం IIT, JEE, NEET ఎంట్రన్స్ పరీక్షలు సెప్టెంబరు నెలలోనే జరగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

కరోనా వ్యాప్తి దృష్ట్యా జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పరీక్షలను వాయిదా వేయ‌డం వ‌ల్ల విద్యార్థులు అకడమిక్ ఇయర్‌ను నష్టపోతారని, అది వారి భ‌విష్య‌త్తుపై ప్రభావం చూపిస్తుంద‌ని, ఇలా ఎందుకు చేయాలంటూ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. వచ్చే ఏడాది కూడా మార్పు రాకపోవచ్చని.. ఇలా ముందుకు వెళ్లాల్సిందేనని న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. ఇదిలాఉంటే.. సెప్టెంబ‌ర్ 1 నుంచి 6వ తేదీ వ‌ర‌కు జేఈఈ మెయిన్స్, సెప్టెంబ‌ర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.