దళితుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు: సీఎం కేసీఆర్

దళితుల అభివృద్ధికి రాబోయే మూడు, నాలుగేళ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం విధివిధానాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలన్నారు. అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించాలన్నారు. వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించాలనుకున్నట్లు వివరించారు. అవసరమైతే మరో రూ.500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ ఎస్సీ సబ్ ప్లాన్‌కు అదనం అని సీఎం తెలిపారు.