ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో తాలిబన్లు

అమెరికా బలగాలు ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి వెనుతిరగడంతో తాలిబన్లు రెచ్చిపోయి.. పదిరోజుల్లోనే ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా తాలిబన్ నేతలు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు. కాబూల్‌లోని ఈ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో వీరి వెంట ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్ అబ్దుల్లా మజారీ కూడా ఉండటం గమనార్హం.

ఈ క్రికెటర్ ఆఫ్ఘన్ తరఫున 2010లో రెండు వన్డే మ్యాచులు ఆడాడు. ఏసీబీలోకి తాలిబన్లు ప్రవేశించిన క్రమంలో క్రికెట్ ఆటకు ఎటువంటి భయం లేదని, బోర్డు స్థాపన నుంచి తాలిబన్లు క్రికెట్‌కు మద్దతుగానే ఉన్నారని ఏసీబీ అధ్యక్షుడు హమీద్ షిన్వారీ తెలిపారు. తాలిబన్ పాలనలో క్రికెట్ పరిఢవిల్లిందని ఆయన అన్నారు.

‘‘తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టం. ప్రారంభం నుంచి మాకు వాళ్ల మద్దతు ఉంది. మా కార్యకలాపాల్లో వాళ్లు ఇప్పటి వరకూ జోక్యం చేసుకోలేదు’’ అని షిన్వారీ తెలియజేశారు. క్రికెటర్ల కుటుంబాలు కూడా సురక్షితంగానే ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే తమకు చైర్మన్ ఉన్నారని, తదుపరి ప్రకటన వరకూ తాను సీఈవోగా కొనసాగుతానని కూడా ఆయన ప్రకటించారు.