ఈ-వీసా ఉంటేనే ఆఫ్ఘన్ ప్రజలకు భారత్‌లో ప్రవేశం: కేంద్రం స్పష్టీకరణ

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి చాలా మంది ప్రజలు వివిధ దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దేశ పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. ఈ క్రమం‌లో భారత్‌లోకి వచ్చే ఆఫ్ఘన్ ప్రజల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు రావాలనుకునే ఆఫ్ఘన్ పౌరులు ఈ-వీసాతోనే దేశంలోకి ప్రవేశించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.

‘‘ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. అదే సమయంలో దేశంలోకి ప్రవేశించే వారిని ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-మిసలేనియస్ (e-Emergency X-Misc) వీసాలతో క్రమబద్ధీకరిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఆఫ్ఘన్‌ పౌరులు భారత్‌కు రావాలంటే ఈ-వీసాలతోనే రావాలని నిర్ణయించాం’’ అని హోంశాఖ తెలిపింది.

అంతేకాదు, ప్రస్తుతం భారత్‌లోని ఆఫ్ఘన్ దేశస్థులకు ఇంతకుముందు జారీ చేసిన వీసాలు కూడా ఇకపై చెల్లుబాటు కావని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ దేశ పౌరులు భారత్‌కు రావాలంటే తప్పనిసరిగా ఈ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దౌత్య కార్యాలయాలు మూతపడిన కారణంగా ఈ వీసా దరఖాస్తులను ఢిల్లీలో పరిశీలిస్తామని అధికారులు చెప్పారు.