కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

వ్యవసాయ రంగంలో సమూల మార్పులను తీసుకొస్తున్నామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లోక్ సభ, రాజ్యసభలో ఈ బిల్లులకు తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ… బిల్లులను కేంద్రం ఆమోదింపజేసుకుంది. అనంతరం ఈ మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపడంతో అవి చట్టరూపం దాల్చాయి. ఈ కొత్త వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాపంగా వివిధ రాజకీయ పార్టీలతో పాటు, రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి.

తాజాగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రైతుల హక్కులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయని, అందువల్ల ఈ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని స్టాలిన్ ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో ధర్నాకు దిగారు.