సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన APPSC
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్షల పై కొద్ది రోజులుగా పెద్దఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్ పూర్తి కావొస్తుండటంతో శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఈమేరకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి 30 వరకు 3 రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ నెల 13 నుంచి దరఖాస్తులు..
ఈనెల 13 నుంచి 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు సూచించింది. ఓటీపీఆర్ ద్వారా వచ్చే యూజర్ ఐడీతో ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం కల్పించినట్టు స్పష్టం చేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని, అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబెషనరీకి అర్హులుగా నిర్ధారించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది.