డిగ్రీ మార్కులే ఎంబీఏ ప్రవేశ అర్హత

కోవిడ్‌-19 కారణంగా మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపించకపోవడంతో ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీయే, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) కోర్సులను నిర్వహించే బిజినెస్‌ స్కూళ్లు, విద్యాసంస్థలు.. డిగ్రీలో విద్యార్థులు పొందిన మార్కులు ఆధారంగా ప్రవేశాలు చేపట్టేందుకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. ఈ వెసలుబాటు 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమేనని, భవిష్యత్తు సంవత్సరాలకు వర్తించదని ఏఐసీటీఈ స్పష్టంచేసింది. కరోనా నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించే విషయంలో స్పష్టత లేనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.