సెప్టెంబరు 21 నుంచి పట్టాలెక్కనున్న మరో 40 స్పెషల్ రైళ్లు

కరోనా వైరస్ వలన రైలు ప్రయాణాలకు ఏర్పడ్డ భారీ డిమాండ్, ఎదురవుతున్న ఇబ్బందుల క్రమంలో రైల్వేశాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. అన్‌లాక్-4 మార్గదర్శకాలతో ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘క్లోన్ రైళ్లు’ పథకం కింద 40 ప్రత్యేక రైళ్లను (20 జతల రైళ్ల సర్వీసులను) సెప్టెంబరు 21 నుంచి నడుపుతున్నట్టు వెల్లడించింది. తద్వారా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు, సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు పొందలేని వారికి ప్రయోజనం కలుగుతుందని ప్రకటించింది. అయితే ఈ స్పెషల్ రైళ్లు భారీ డిమాండ్ ఉన్న నిర్దిష్ట మార్గాల్లోనే నడపబోతున్నట్టు తెలియజేసింది.

ఈ క్లోన్ రైళ్లన్నీ రిజర్వ్‌డ్.. కావున ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని, అలాగే ఇవి కొన్ని స్టేషన్లల్లోనే మాత్రమే ఆగుతాయని రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఇప్పటికే సర్వీసులో ఉన్న310 ప్రత్యేక రైళ్లకు అదనంగా వేశారు. క్లోన్ రైళ్లు ప్రధానంగా 3 ఏసీ రైళ్లు ,ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్ల కంటే ముందు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైలు కంటే క్లోన్ రైలు వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ రైళ్లకు రిజర్వేషన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 10 రోజులు వరకూ ఉంటుంది.