యుద్ధాన్ని కోరుకోవడంలేదు: జిన్ పింగ్

భారత్‌ సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతూనే శాంతి మంత్రం జపించింది చైనా. గత కొద్దిరోజులుగా తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇరుదేశాల అధికారుల మధ్య విడతలవారీగా చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, కోల్డ్‌వార్‌, హాట్‌ వార్‌.. ఏదీ తమకు అవసరం లేదన్నారు. 75వ యూఎన్‌ సర్వసభ్య సమావేశం సందర్భంగా రికార్డు చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. దేశాల మధ్య బేధాభిప్రాయాలు ఉండటం సహజమేనని, అయితే, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశమైన చైనా.. శాంతియుత, సహకార సంబంధమైన అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. తమ దేశం ఎప్పటికీ విస్తరణ, ఆధిపత్యాన్ని కోరుకోదని చెప్పారు. ఇతర దేశాలతో తమకు ఉన్న విభేదాలను తగ్గించుకుంటామని, సంభాషణలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటామన్నారు. ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిన్న ప్రారంభo కాగా.. కరోనా నేపథ్యంలో ఆయా దేశాల అధినేతలు ఈ సమావేశానికి వర్చువల్‌ పద్ధతిలోనే తమ సందేశాలను పంపారు.