దివాళీ రోజు ‘కళాతపస్వి’ ఆశీస్సులు తీసుకున్న చిరంజీవి

తెలుగు ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు కే విశ్వనాథ్. ఆయనతో పని చేయాలని చాలా మంది హీరోలు కలలు కంటుంటారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అందులో ఒకరు. ఆయన కల కెరీర్ ఆరంభంలోనే తీరింది. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు లాంటి సినిమాలు చేసారు చిరంజీవి. వీటితో ఆయనకు నటుడిగా మరింత పేరు తో పాటూ, అప్పటి వరకు మాస్ హీరోగా గుర్తింపు ఉన్న చిరంజీవిని క్లాస్ ఆడియన్స్ కి దగ్గర చేశాయి.

తన కెరీర్ లో మైలురాయి చిత్రాలను అందించిన కళాతపస్విని దీపావళి సందర్భంగా చిరంజీవి సతీసమేతంగా కలిసి ఆయన ఇంటికి చేరుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి చిరంజీవి – సురేఖ పాదాభిందనం చేశారు. చిరంజీవి – సురేఖ దంపతులు విశ్వనాథ్ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు ముచ్చటించిన చిరు – విశ్వనాథ్ ఇద్దరు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సతీసమేతంగా తన ఇంటికి రావడం పట్ల కె.విశ్వనాథ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “విశ్వనాథ్ గారిని కలవాలనిపించి. ఈరోజు ఆయన ఇంటికి సురేఖతో కలిసి వచ్చాను. ఆయన నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు అందించారు. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.