గౌచార్ నుంచి బద్రీనాథ్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రులు

కేదార్‌నాథ్ ఆలయ సందర్శనకు వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు త్రివేంద్రసింగ్ రావత్, యోగి ఆదిత్యనాథ్ లు మంగళవారం ఉదయం గౌచార్ నుంచి బద్రీనాధ్ కు హెలికాప్టరులో బయలుదేరారు. కేదార్‌నాథ్ ఆలయ ముగింపు వేడుకకు వెళ్లి, విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా అక్కడ చిక్కుకుపోయిన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు త్రివేంద్రసింగ్ రావత్, యోగి ఆదిత్యనాథ్‌లు సోమవారం అక్కడి నుంచి బయటపడ్డారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సీఎంలు ఇద్దరూ కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయినా సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో వారు గౌచార్‌కు క్షేమంగా చేరుకున్నారు.

గౌచార్ లోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు క్యాంపులో ఇద్దరు సీఎంలు బస చేశారు. కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో మంచు విస్తారంగా కురువడంతోపాటు ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గింది. మంగళవారం ఉదయం గౌచార్ నుంచి బయలు దేరిన ఇద్దరు ముఖ్యమంత్రులు బద్రీనాథ్ దేవాలయంలో పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ లో 11 కోట్ల రూపాయలతో అతిథిగృహాలు నిర్మించనున్నారు.