అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని మోదీ

కరోనా కేసుల ఉధృతి రోజు రోజుకీ పెరిగిపోతున్న కారణంగా  ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఈ నెల 27 న జరుగుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత కాలంలో దేశంలో కరోనా ఉధృతితో పాటు 3.0 అన్‌లాక్ పరిస్థితులపై చర్చించనున్నారు.

జూన్ 16,17 తేదీల్లో… వరుసగా రెండు సార్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా… ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా తీవ్రత, ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలతో పాటు లాక్‌డౌన్ సడలించిన తర్వాతి పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం.

అంతేకాకుండా దేశంలో త్వరలోనే రోజు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 27 న జరగబోయే వీడియో కాన్ఫెరెన్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. దేశంలో ఐసీయూ పడలకు, వెంటిలేటర్ల కొరత తీవ్రత మొదలగు అంశాలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.