రైతుల ఆందోళనపై అర్ధరాత్రి భేటీ అయిన కేంద్రమంత్రులు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆదివారం అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, వ్యవసాయ మంత్రి తోమర్ సమావేశమయ్యారు. ఢిల్లీ వేదికగా రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అనే అంశాలపై ఈ సమావేశం సాగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఐదు వైపులా తాము రోడ్డును నిర్బంధిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చాయి. దీంతో పాటు రైతుల విషయంలో తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై వీరు చర్చించినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల్ని తీవ్రం గా నిరసిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావని రైతులు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించారు. పంజాబ్‌, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని తట్టుకుంటూనే నిరసన కొనసాగించారు.

మరోవైపు డిసెంబర్‌ 3న రైతు సంఘాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. కాగా ముందస్తు చర్చలపై కేంద్ర ప్రతిపాదనను రైతులు తిరస్కరించడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అనే అంశాలపై కేంద్ర మంత్రులు చర్చించినట్లు సమాచారం.