అంబానీ ఇంట వారసుడు వచ్చాడు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత హోదాను సంపాదించారు.  ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య శ్లోకా మెహతా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ముంబైలోని ఓ టాప్ కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ రోజు శ్లోకా మెహతా.. కుమారుడికి జన్మనిచ్చినట్లు ముఖేష్ అంబానీ కుటుంబం వెల్లడించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది.

శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీల వివాహం గత ఏడాది మార్చిలో ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా, మోనా మోహతాల కుమార్తె శ్లోకా. శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్‌ అంబానీ తల్లిదండ్రులయ్యారని ముఖేష్ కుటుంబం పేర్కొంది. నీతా- ముఖేష్‌ అంబానీ మొదటిసారిగా గ్రాండ్ పేరెంట్స్ అయ్యారని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ధీరూభాయ్ వంశంలో కొత్త తరం ఆరంభమైందని, నూతన శకానికి ఇది దారి తీస్తుందని కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టెలికమ్యూనికేషన్ల విభాగాన్ని ఆకాష్ అంబానీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లలో ఆకాష్ ఒకరు. ఆకాష్ చెల్లెలు ఇషా అంబానీ కూడా రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఉన్నారు. పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఫార్చ్యూన్ 40 జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంబానీల లెగాసీని కొనసాగిస్తున్నారు. ఆయన భార్య శ్లోకా కూడా వ్యాపారరంగంలో ఉన్నారు. తన తండ్రికి చెందిన కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. కనెక్ట్ ఫర్ అనే సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు.