ప్రతిపక్షాలు అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయి..

కొత్త చట్టాలు చిన్న, సన్నకారు రైతుల లబ్ధికోసమే తీసుకువచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తీసుకొచ్చినవి కావని, దీని వెనుక దశాబ్దాల పాటు చర్చలు, సంప్రదింపులు ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేసిన బహిరంగ లేఖను ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరముందన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం మధ్యప్రదేశ్ రైతులతో వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

అన్నదాతలను తప్పుదోవ పట్టేందుకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఇతర దేశాల రైతులు కొత్త కొత్త టెక్నాలజీలతో ముందుకు దూసుకెళ్తున్న వేళ మన దేశ రైతులు వెనుకబడేలా చేయడం సమంజసం కాదన్నారు. సాగు చట్టాలకు సంబంధించి రైతులు కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో పార్టీల మేనిఫెస్టోలు చూసినా ఇవే హామీలు కనిపిస్తాయి అని మోదీ స్పష్టం చేశారు.

కనీస మద్దతు ధరను తొలగించే ప్రసక్తే లేదని కూడా ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఒకవేళ తమకు ఎంఎస్‌పీని తీసివేసే ఉద్దేశమే ఉంటే.. ఎందుకు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్‌ను అమలు చేస్తామని ప్రశ్నించారు. మద్దతు ధర విషయంలో తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నదనీ, అందుకే ప్రతి ఏటా పంట వేయకముందే మద్దతు ధరను ప్రకటిస్తున్నామని మోదీ చెప్పారు.