మరో మూడు రోజులపాటు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు

• జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
‘జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ మహాక్రతువులో పాలు పంచుకుంటున్న వాలంటీర్లు, జనసైనికులు, వీర మహిళల స్ఫూర్తి నిరూపమానం. వారికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘గత కొద్ది రోజులుగా సాగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అమిత వేగంతో సాగుతోంది. అన్ని ప్రాంతాల నుంచి సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభ పరిణామం. అయితే సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టినట్లు, సభ్యత్వం గడువు మరి కొంత పెంచాలని జన సైనికులు, వాలంటీర్లు, వీర మహిళల నుంచి లెక్కకు మించి అభ్యర్థనలు జనసేన పార్టీ కార్యాలయానికి అందాయి. దీంతో సభ్యత్వ నమోదు గడువును మరో మూడు రోజులు పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగియాల్సిన గడువును మార్చి 3వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు పెంచుతూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాన్ని అనుసరించి సభ్యత్వ నమోదు గడువు మూడు రోజులపాటు పెంచుతున్నాం. దీన్ని వాలంటీర్లు, జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు గమనించాలని కోరుతున్నాను’’ అన్నారు.