డ్రైవర్ లెస్ ట్రైయిన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశరాజధాని ఢిల్లీలో డ్రైవర్ లెస్ మెట్రో ట్రైయిన్ ప్రారంభమైంది. డ్రైవర్ లెస్ ట్రైయిన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ మెట్రో రైలును ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు.
ఈ డ్రైవర్ లెస్ ట్రైయిన్ను.. మాజెంటా లైన్లో జనక్పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. 2022లో మజ్లిస్ పార్క్ నుంచి శివ్ విహార్ మధ్య 57 కిలోమీటర్లు వరకు పొడిగించనున్నారు. దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు(NCMC)ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో భాగంగా న్యూ దిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ 21 వరకు ఉన్న 23 కిలోమీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుంది.
ఈ మెట్రో రైలులో హై రిజల్యూషన్ కెమెరాలు, రిమోట్ హ్యాండ్లింగ్, రియల్ టైమ్ మానిటరింగ్ రైలు పరికరాలతో అత్యవసర అలారం మరియు హైటెక్ సౌకర్యాలు ఉంటాయి. డ్రైవర్లేని మెట్రో రైలు ప్రయాణం ఢిల్లీ-ఎన్సీఆర్ నివాసితులకు సౌకర్యంగా ఉంటుందని డీఎంఆర్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ తెలిపారు. ఇది మెట్రో ప్రపంచంలో మెరుగైన చైతన్యం కొత్త శకానికి దారితీస్తుంది అని దయాల్ వెల్లడించారు.