సామూహిక అత్యాచార బాధితురాలిని సంరక్షించాలి

• నిందితులని కఠినంగా శిక్షించాలి
హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మానాన్న లేని ఆ బాలిక తన తమ్ముడితో కలసి జీవిస్తుంటే నలుగురు మృగాళ్ళు చేసిన అఘాయిత్యం మానవత్వానికి ఒక మచ్చ. బాధిత బాలిక తమ్ముణ్ణి బెదిరించి… గంజాయి మత్తులో తూగుతూ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాల్ని సంరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆ బాలిక, ఆమె సోదరుడు మనో ధైర్యంతో బతికే విధంగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్. గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గంజాయి ముఠాలు పెరుగుతున్నాయనే వార్తలు తరచూ వింటున్నాం. ఈ నగరానికీ, తెలంగాణకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో కూడా పత్రిక, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు చెబుతూనే ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ ముఠాలను అణచివేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి ఘాతుకాలకు అడ్డుకట్ట వేయగలం అని జనసేనాని వ్యాఖ్యానించారు.