ఎంఎస్‌ ధోనీలో నటించిన మరో నటుడు సందీప్ ఆత్మహత్య..

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు, ఎం.ఎస్. ధోనీ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కో-స్టార్ సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడానికి ముందు ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో పోస్టు చేశారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆ వీడియోలో తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదని అన్నారు. 10 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో చాలా అంశాలను ప్రస్తావించారు. పెళ్లి తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో వివరించారు. ఇటు వ్యక్తిగత జీవితంలో అటు వృత్తి రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు సందీప్ నహర్ తన సూసైడ్ నోట్‌లో తెలిపారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. భార్య గురించి అనేక ఆరోపణలు చేసిన సందీప్.. తన మరణానికి ఆమె కారణం కాదని స్పష్టం చేశారు.

సందీప్ వయసు 33 ఏళ్లు. ఆయన ఆత్మహత్య వార్తతో బాలీవుడ్‌లో మరోసారి అలజడి రేగింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఇప్పటికీ ప్రకంపనలు రేపుతుండగా.. తాజాగా అదే సినిమాలో నటించిన మరో యాక్టర్ ఆత్మహత్య చేసుకొని మరణించడం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ కలచివేస్తోంది. కేసరి సినిమాలో అక్షయ్ కుమార్ పక్కన సహాయ నటుడిగానూ సందీప్ నహర్ నటించి మెప్పించారు. ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ నహర్ నివాసం నుంచి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.