ఎయిర్ ఇండియా ఆఫర్.. ప్రయాణంలో 50 శాతం రాయితీ..

60 ఏండ్లు పైబడిన వయో వృద్ధులకు విమాన ప్రయాణంలో 50 శాతం రాయితీని ఇవ్వనున్నామని ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా బంపరాఫర్ ను ప్రకటించింది. ఇండియాలోని వివిధ నగరాల మధ్య ప్రయాణం చేసే వృద్ధులకు ఎకానమీ క్లాసులో ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. టికెట్లను సంస్థ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని పేర్కొంది. ఆఫర్ లో టికెట్లను పొందే వారు తప్పనిసరిగా భారతీయులై ఉండాలని లేదా శాశ్వతంగా ఇక్కడ ఉంటున్నవారే అయ్యుండాలని పేర్కొంది. టికెట్లు పొందేవారు బోర్డింగ్ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ వంటి వయసును నిర్ధారించే గుర్తింపు కార్డును కలిగివుండటం తప్పనిసరని, ప్రయాణానికి కనీసం వారంరోజుల ముందుగా టికెట్ ను బుక్ చేసుకోవచ్చని, ఏడాదిలోపు ప్రయాణపు తేదీ వరకూ తమకు నచ్చిన సర్వీసులో టికెట్ ను తీసుకోవచ్చని వెల్లడించింది.