అలీ సొంత బ్యానర్ లో ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’

అలీ, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రల్లో  అలీ సొంత బ్యానర్ ‘అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై తెరకెక్కుతున్నచిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి.’ ఈ బ్యానర్ లో ఇదే తొలి సినిమా కావడం విశేషం.  శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి ఎస్వీ.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అలీతో నాకు మంచి బంధం ఉందని అన్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. అలీ మాట్లాడుతూ… దర్శకుడు కిరణ్, నేను చెన్నై లో రూమ్ మేట్స్, మలయాళం లో జరిగిన ఒక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నామని తెలిపారు. ఈ కథ నచ్చి వెంటనే నరేష్ గారికి ఈ సినిమా చూడమని చెప్పానని అన్నారు. పవిత్ర లోకేష్, రవిశంకర్ ఈ సినిమాలో మంచి పాత్రలు చేస్తున్నారని వివరించారు. రాకేష్ మ్యూజిక్, భాస్కరభట్ల సాహిత్యం అందిస్తున్నారని అన్నారు.