సత్తెనపల్లిలో అంబటి మార్క్ అవినీతి బట్టబయలు

  • రూ. 8.88 కోట్ల కుంభకోణం

అంబటి రాంబాబు అవినీతికి అంతూ పొంతూ లేకుండా పోతుందని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు మండిపడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిత్రులారా! గత నాలుగేళ్ళుగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు అవినీతికి అంతూ పొంతూ లేకుండా పోతుంది. అందిన కాడికి దోచుకుకోవడమే అజెండాగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా రూ.8.88 కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. 2023 మార్చి 31వ తేదీన స్థానిక సత్తెనపల్లి మున్సిపాలిటి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రప్రభుత్వం ఎన్.జి.టి వారి సూచనల మేరకు “స్వచ్చంద-స్వచ్చ భారత్” అనే కార్యక్రమంలో భాగంగా సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (మురుగునీటిని శుధ్ధిచేసే ప్లాంట్) ఏర్పాటు చేసుకునేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు, ఆ మేరకు ఫలానా సర్వే నంబర్లలో 4 ఎకరాలను 8.88 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు కౌన్సిల్ కి సమాచారం ఇచ్చారు. దీని తర్వాత 15 రోజులకి అదే సర్వే నంబర్ లో మున్సిపల్ చైర్-పర్సన్ భర్త చల్లంచర్ల సాంబశివరావుకి, అంబటి రాంబాబుకి సన్నిహితుడు, బినామీ అయిన సోము సురేష్ అనే వ్యక్తి ద్వారా రెండు ఎకరాలు కొనిపించి అతని ద్వారా మున్సిపాలిటీ కొనే విధంగా పధకాన్ని రచించారు. తొండలు కూడా గుడ్లు పెట్టని చౌడు భూమిని ఎకరా 2 కోట్ల 22 లక్షల చొప్పున ప్రతిపాదనలు రెడీ చేశారు. కేంద్రప్రభుత్వం నుండి డబ్బులు జేబులో వేసుకోవచ్చని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయం మేము అనగా ‘జనసైనికులం’ సదరు సర్వే నంబర్లు ఆధారంగా ఈసీలు, నకళ్ళు తీసి పరిశీలించగా గుట్టు బట్టబయలయ్యింది. సదరు సోము సురేష్ అనే వ్యక్తి సత్తెనపల్లి పట్టణంలో చల్లంచర్ల సాంబశివరావు అండదండలతో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్టు మా విచారణలో తెలిసింది. ప్రజలు తినీ తినకా పైసా పైసా పోగుచేసి పన్నులు కడ్తుంటే ఈ రాబందులు ఈ విధంగా ప్రజాధనాన్ని పందికొక్కుల్లాగా దోచుకుతింటున్నారు. ఎవరూ అడిగేవాడు లేడని విచ్చలవిడితనంతో, దుర్మార్గంగా ప్రజాధనాన్ని మింగుతున్నారు. గతంలో “జగనన్న ఇళ్ళస్థలాల్లో” కూడా ఇదేవిధంగా అవినీతికి పాల్పడి రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలను తిన్నారు. మామూలుగా ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం సదరు భూమి ఎకరా 20 నుండి 30 లక్షలు మాత్రమే ధర పలుకుతుంది. ప్రభుత్వ మార్కెట్ విలువే 40 లక్షలు ఉంది. కానీ ఎకరా 2 కోట్ల 22 లక్షలకు ప్రతిపాదనలు పంపారంటే వారి ధైర్యమేంది? ఎవ్వరూ అడిగేవారు లేరనేగా? సత్తెనపల్లి పట్టణం శివారులోనే అంత ధర లేదు. పైగా సదరు భూమికి ప్రక్కనే 5,6 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉంది. రూపాయి ఖర్చు లేకుండా సదరు భూమిలో సదరు ప్లాంటుని నిర్మించుకోవచ్చు. అప్పుడు ప్రజాధనం వృధా కాదు. మంత్రి అంబటి రాంబాబు తక్షణమే ఈ విషయంపై స్పందించాలి. నిజంగా తన ప్రమేయం లేకపోతే వెంటనే సదరు అక్రమమైన, అన్యాయమైన ప్రతిపాదనలను ఉపసం హరించాలి. లేనిపక్షంలో ఈ ఉదంతంపై జనసేన పార్టీ ఉద్యమ కార్యాచరణ తీసుకుని ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. ఎవ్వరూ పట్టించుకోకపోయినా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడడానికి జనసేన ఎల్లప్పుడూ సిధ్ధంగా ఉంటుంది. ఖబడ్దార్ అని సాంబశివరావు హెచ్చరించారు.