అమరావతే ఆంధ్రుల రాజధాని: పెండ్యాల శ్రీలత

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆది నుండీ ఆంధ్రులకు ఒక్కటే రాజధాని.. అది అమరావతే అని స్పష్టంగా తెలియజేశారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు హైకోర్టు అంగీకరించి.. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీ.ఆర్డీ.ఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఒకింత జగన్ సర్కార్‌కు కోర్టు మొట్టికాయలేసింది.

తనఖా పెట్టొద్దు…?

భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కార్‌కు కోర్టు సూచించింది. అంతేకాదు.. 3 నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం డెడ్ లైన్ కూడా విధించింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని జగన్ సర్కార్‌కు కోర్టు సూచించింది. మరోవైపు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అమరావతి భూములను తనఖా పెట్టడానికి వీళ్లేదని.. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి ఇవ్వొద్దని కూడా కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50వేలు కూడా ఇవ్వాలని కోర్టు తెలిపింది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్నారు. మొత్తానికి చూస్తే రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. కాగా.. ఇప్పటికే ప్రభుత్వం, రైతుల వాదనలు విన్న కోర్టు.. గురువారం నాడు కీలక తీర్పునే ఇచ్చింది. నిన్నటి నుంచి హైకోర్టు తీర్పుపై రాజధాని రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎప్పుడెప్పుడు వస్తుందా అని శిబిరాల్లో టీవీలు పెట్టుకుని మరీ కోర్టు తీర్పు కోసం రైతులు వేచి చూశారు. తీర్పు అనుకూలంగా రావడంతో శిబిరాల్లో సంబరాలు చేసుకుంటున్నారు.