జనసేన ప్రచార కార్యదర్శిగా సాగర్ కు నియామక పత్రం అందజేత

జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమితులైన ప్రముఖ బుల్లి తెర నటుడు శ్రీ ములుకుంట్ల సాగర్ కు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో నియామక పత్రం అందచేశారు. జనసేన భావజాలానికి ఆకర్షితులై శ్రీ సాగర్ ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే. మహిళాలోకంతో పాటు ఆశేష ప్రేక్షక ఆదరాభిమానాలు కలిగిన శ్రీ సాగర్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. జనసేన – బిజెపి కూటమి సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.
నియామకం
ప్రముఖ బుల్లి తెర నటుడు శ్రీ ముల్లుగుంట్ల సాగర్ ను జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. జనసేన భావజాలం, పార్టీని గత పదేళ్లుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్న తీరు పట్ల ఆకర్షితులైన శ్రీ సాగర్ ఇటీవల జనసేన పార్టీలో చేరారు. వామపక్ష భావజాలం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రామగుండం వాసి శ్రీ సాగర్, తనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు విన్నప్పుడు వామపక్ష భావజాలమే వినిపించిందని పార్టీలో చేరిన సందర్భంలో పేర్కొనడం గమనార్హం. మహిళలతోపాటు అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలు కలిగిన శ్రీ సాగర్ కు పార్టీలో గౌరవ ప్రదమైన బాధ్యతలు అప్పగిస్తామని ఆయన చేరిన నాడే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా పార్టీ ప్రచార కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవిని శ్రీ సాగర్ సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం తనకుందని, పదవీ నిర్వహణలో ఆయన సఫలీకృతం కావాలని మనసారా కాంక్షిస్తూ శ్రీ సాగర్ కు శుభాభినందనలు తెలిపారు.