ద్వారకా తిరుమల ఆలయ భద్రత ఏర్పాట్ల పరిశీలన

ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ భద్రత ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ సోమవారం సందర్శించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ భద్రత, స్వామివారి ప్రచార రథం, బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే రథం భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమేరాల స్థితిగతులను, అగ్ని ప్రమాదాల నియంత్రణకు ఉపయోగించే పరికరాల్ని పరిశీలించారు. స్వామి వారి రథాన్ని భద్రపరిచిన రథశాల వద్ద రక్షణ ఏర్పాట్లపై ఆరా తీశారు. భద్రతకు సంబంధించి దేవస్థానం అధికారులకు పలు సూచనలిచ్చి ఆడిట్‌ రిపోర్టు తయారు చేస్తామని ఎస్పీ తెలిపారు. భద్రత విషయంలో ఏమైనా లోపాలు ఉంటే ఆలయ ఈవో ప్రభాకరరావుకు తెలియజేస్తామన్నారు.