ఆసరాలేని వృద్ధుల కోసం మండల కేంద్రాల్లో ఆనంద ఆశ్రమాలు: పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట నియోజకవర్గం, జనం కోసం జనసేన 729వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో నిరుపేదరాలైన ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం మొత్తంగా చాలా గ్రామాలలో ఎవరి ఆసరా లేక ఇలాంటి అవస్థలు పడుతున్న నిరుపేదలైన వృద్దులు అనేక మంది ఉన్నారని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఇలాంటి నిరుపేదలైన వృద్ధుల కోసం అన్ని రకాల సదుపాయాలతో ఆనంద ఆశ్రమాలు నిర్మించి జనసైనికులు అంతా వారికి ఒక బిడ్డలాగా అండగా నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.