ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రసంగిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా రెండో వేవ్ ఉద్ధృతి పెరిగిందన్నారు. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఈ సందర్భంగా గవర్నర్ సెల్యూట్ చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్‌ను తెప్పించినట్టు గవర్నర్ వివరించారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచిందని అన్నారు. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చామని, 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని గవర్నర్ వివరించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా, హోంమంత్రి సుచరిత శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశపెడతారు.