ఈటల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హరీశ్‌ రావు

టీఆర్ఎస్ పార్టీలో మంత్రి హరీష్ రావు కూడా అవమానం జరిగిందన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్‌ పార్టీలో తాను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తనని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తనకు పార్టీ ప్రయోజనాలే పరమావధి అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం తన విధి, బాధ్యత అని చెప్పారు. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కార్తవ్యంగా భావిస్తానన్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులు అని చెప్పారు. కేసీఆర్ మాట జవదాటకుండా నడుచుకుంటున్నాని చెప్పారు. గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్ఫష్టంగా అనేక వేదికలపై చెప్పానని గుర్తు చేశారు.

కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని హరీష్ స్పష్టం చేశారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్ వైఖరి ఉందని విమర్శించారు. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు అని అన్నారు. పార్టీలో ఉండాలా ? వెళ్లిపోవాలా ? అన్నది ఆయన ఇష్టం అని పేర్కొన్నారు. ఈటల పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. తన సమస్యలకు, తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్య్రానికి, విజ్ఙత, విచక్షణలేమికి నిదర్శనం అని విమర్శించారు. తన భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం అని అన్నారు. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు.