సచిన్ తనయుడికి ఊరట.. ఐపీఎల్ వేలం తుదిజాబితాలో చోటు

ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ కోసం ప్రకటించిన ముంబయి జట్టులో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు స్థానం లభించలేదు. దాంతో ఐపీఎల్ వేలంలో సచిన్ తనయుడి పరిస్థితి ఏమిటన్నదానిపై అనిశ్చితి ఏర్పడింది. ముంబయి జట్టులో కూడా స్థానం దక్కించుకోలేని అర్జున్ ను ఐపీఎల్ వేలానికి పరిగణనలోకి తీసుకోవడం కష్టమేనని క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు.

అయితే అర్జున్ టెండూల్కర్ కు ఊరట కలిగించేలా అతడి పేరును ఐపీఎల్ వేలం తుదిజాబితాలో చేర్చారు. ప్రారంభ ధర రూ.20 లక్షల కింద ఆల్ రౌండర్ల కేటగిరీలో అర్జున్ టెండూల్కర్ పేరు నమోదైంది. మొత్తం 292 మంది క్రికెటర్లు తుది జాబితాలో చోటు సంపాదించుకోగా, వారిలో 21 ఏళ్ల అర్జున్ కూడా ఉన్నాడు. ఈ నెల 18న చెన్నైలో ఐపీఎల్ వేలం నిర్వహించనున్నారు.

కాగా, అర్జున్ టెండూల్కర్ 2020-21 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా టీ20 క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఈ టోర్నీలో ముంబయి జట్టు తరఫున రెండు మ్యాచ్ లు ఆడిన ఈ సెలబ్రిటీ వారసుడు కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.