ఆగస్టు 14 ఇకపై ‘విభజన స్మృతి దివస్’
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ..ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆగస్టు 14ను విభజన విషాద సంస్మరణ దినంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్, పాక్ విభజన సమయంలో వేలాది మంది ప్రాణాలు అర్పించారని.. వారి త్యాగాలను స్మరించుకుంనేదుకు ఆగస్టు 14వ తేదీని విభజన విషాద సంస్మరణ దినంగా పాటించాలన్నారు. దేశ విభజన నాటి గాయాలను ఎన్నటికీ మరువలేమని మోదీ అన్నారు. కొన్ని లక్షల మంది భారతీయ సోదరులు, సోదరీమణులు దేశ విభజన వల్ల నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. ద్వేషం, హింస వల్ల ఎందరో ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారి త్యాగాలు, కష్టాలను గుర్తు చేసుకునేందుకు.. ఆగస్టు 14ను ఇకపై ‘విభజన భయోత్పాత స్మారక దినం’గా ప్రకటిస్తున్నానని మోదీ వెల్లడించారు. సామాజిక వ్యత్యాసాలు, విరోధం వంటివి తొలగిపోతాయని ఆశిద్దామన్నారు.
కాగా, దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం వచ్చింది. 1947లో బ్రిటీష్ పరిపాలన ముగిసిన తరువాత భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. దీంతో పాకిస్థాన్ ముస్లిం దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆ విభజన సమయంలో కొన్ని లక్షల మంది భారతీయులను ఊచకోత కోశారు. దీంతో లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. అనేక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
May the #PartitionHorrorsRemembranceDay keep reminding us of the need to remove the poison of social divisions, disharmony and further strengthen the spirit of oneness, social harmony and human empowerment.
— Narendra Modi (@narendramodi) August 14, 2021